(న్యూస్ఇన్, హైదరాబాద్)
మంత్రిగా ఉన్న కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడంతో…… మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారు. ముఖ్యమంత్రితో తనకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేస్తూ ప్రకటన చేశారు. మంత్రి వర్గంలోకి రావాలని భారీగా ఆశలు పెట్టుకున్న కోమటి రెడ్డి నిన్న మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని అవకాశం వచ్చినప్పుడు టార్గెట్ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్లే కబ్జా చేస్తున్నారన్న వాదన కూడా వినిపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు తెలియని వారు కీలక పదవుల్లో ఉన్నారన్న అభిప్రాయాలను దాదాపు రెండేళ్లుగా వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కూడా బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు.కాంగ్రెస్ లో చేరే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఎన్నో సార్లు వ్యాఖ్యలు చేశారు. మంత్రి వర్గంలో రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం దక్కడంతో రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం సాధ్యం కాలేదు…. కానీ ఈ అంశాన్ని కూడా ఆయన సమర్ధించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ హై కమాండ్ కు ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి వాదనలో నిజం ఉన్నా…. ఒకే కుటుంబంలో ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదన్న స్పష్టమైన సంకేతాలను పార్టీ హై కమాండ్ కూడా ఇస్తోంది.

అయినా కొండా సురేఖ ఎపిసోడ్ మొదలైన తరువాత కూడా రాజగోపాల్ రెడ్డి పార్టీ పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పరోక్షంగా సీఎం ను టార్గెట్ చేస్తూ క్యాబినెట్లో అవకాశం కల్పించాలన్న డిమాండ్ ను వినిపించారు. ఇక అనూహ్యంగా కొండాపై చర్యలు తీసుకునేందుకు పార్టీ హై కమాండ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించడంతో రాజగోపాల్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్ పడ్డట్లు కనిపిస్తోంది. కొండా సురేఖకు పలువురు సీనియర్లు మద్దతు ఇస్తూ…పార్టీ హై కమాండ్ ముందు తమ వాదన వినిపించినా…ముఖ్యమంత్రి అభిప్రాయాలతోనే ఏఐసీసీ ఏకీభవించి కొండా సరేఖతో పాటు మరో సీసియర్ నేత చిన్నా రెడ్డిలను కూడా పదవుల నుంచి తప్పించింది. దీంతో హై కమాండ్ లో సీఎం కు పూర్తి స్థాయిలో అండదండలు దక్కడంతో రాజగోపాల్ రెడ్డి ఒక్క రోజులోనే మాట మార్చారు. సీఎం కు తనకు ఎక్కడా విబేధాలు లేవని ప్రకటించారు.
సీఎం రేవంత్ ను అవకాశం వచ్చిన్పుడల్లా టార్గెట్ చేసే రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఇతర నేతలకు కూడా సీఎం పరోక్షంగా గట్టి సంకేతాలు ఇచ్చారు. పార్టీ ధిక్కరిస్తే…కొండా సురేఖకు పట్టిన గతే పడుతుందని తన చర్యలు నిరూపించారు. ఎన్నికలకు మరో రెండేల్లు సమయం ఉండడంతో అసంతృప్త నేతలు ఒక్క సారిగా సైలెంట్ అయ్యారు. సీఎం తో నిన్న మొన్నటి వరకు విబేధించిన నేతలు ఒక్కొక్కరు సీఎంకు అనుకూలంగా మారుతున్నారు. అయితే మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ కూడా ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ సమయంలో సీఎం ను టార్గెట్ చేస్తూ…అంది వచ్చిన అవకాశం మళ్లీ మొదటికి వస్తుందన్న అనుమానాలు సన్నిహితులతో రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.












Leave a Reply