(న్యూస్ఇన్,హైదరాబాద్)
నగరంలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహా వివిధ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ సమావేశాన్ని నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు సజావుగా పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన ముందు జాగ్రత్తలను సజ్జనార్ వివరించారు. హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేంఉదకు అందరి సహకారం అవసరం అన్నారు.

విగ్రహాల ఆగమనం సమయంలో అధిక వేగం, రద్దీ, వాహనాలపై డ్యాన్సులు ప్రమాదాలకు దారితీస్తున్నాయని హెచ్చరించారు. విగ్రహాల తరలింపు వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేసి, రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో తరలించాలని సూచించారు. నిమజ్జన మార్గాల్లో విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలు, రోడ్ల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించినట్లు తెలిపారు.
నిర్వాహకులు కూడా ప్రతి గణేశ్ మండపం వద్ద బాధ్యతాయుతమైన వాలంటీర్లను నియమించి, వారి వివరాలను పోలీస్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రులు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. నిమజ్జన రోజున ఉదయమే ఊరేగింపులు ప్రారంభించేలా నిర్వాహకులు సహకరించాలని కోరారు.











Leave a Reply