NewsInn

News in a Click

విద్య పై చ‌ర్చ‌- రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

విద్య పై చ‌ర్చ‌- రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

తెలంగాణ విద్యా విధానంపై శాసనసభలో చర్చ జరగడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సభ్యులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తున్నామని, ఇందుకోసం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిషన్ నివేదికను పరిశీలించేందుకు కేకే నేతృత్వంలో కమిటీని నియమించామని చెప్పారు.

55 రోజుల్లో 10,006 మంది టీచర్ల నియామకం..

అధికారంలోకి వచ్చిన రెండు నెల‌ల్లోపే 10,006 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా నియామకాలు చేపట్టామన్నారు. తన హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మేర పెరిగిందని చెప్పారు. జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను దృష్టిలో పెట్టుకుని విద్యా విధానాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీకి శ్రీకారం…..

ప్రైవేటు పాఠశాలల్లో చిన్న వయసులోనే పిల్లలను చేర్పిస్తుండటంతో తల్లిదండ్రులు అటువైపు మొగ్గుచూపుతున్నారని సీఎం అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులకు ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నట్లు చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు.

పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు….

పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం ఖండించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఇప్పటిలాగే ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడమే జీవో ఎంఎస్ నంబర్ 97 ఉద్దేశమన్నారు.

క్లీన్‌చిట్ కళాశాలలకే ఫీజు రీయింబర్స్‌మెంట్…..

కేంద్రం నుంచి నిధులు పొందాలంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని చెప్పారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో క్లీన్‌చిట్ వచ్చిన కళాశాలలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విద్యా రంగంలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం విద్యార్థుల కోసం మాత్రమేనని, కాలేజీ యాజమాన్యాల కోసం కాదని స్పష్టం చేశారు. అస‌లైన‌ కళాశాలలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తామని సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *