(న్యూస్ఇన్,హైదరాబాద్)
పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన, ఆధునిక సౌకర్యాలు అందించడంలో హైదరాబాద్ మరో అడుగు ముందుకేసింది. లుంబినీ పార్క్లో ఏర్పాటు చేసిన Reflow CRT (Circular Resource Technology) Zero Discharge Toilet Unit ను మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీరో డిశ్చార్జ్ పబ్లిక్ టాయిలెట్ను తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రులు తెలిపారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, రీఫ్లో సంస్థల భాగస్వామ్యంతో ఈ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధునాతన హైజీన్ ప్రమాణాలతో రూపొందించిన ఈ టాయిలెట్ను ప్రజలు ఉచితంగా వినియోగించుకోవచ్చని చెప్పారు.

వినియోగించిన నీరు, వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే రీసైక్లింగ్ సాంకేతికత ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా మంత్రులు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఇలాంటి రెండు ఆధునిక టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు గేట్స్ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
రీఫ్లో సాంకేతికతను టీ-వర్క్స్ ద్వారా ప్రోటోటైపింగ్ చేసి, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు, దేశాలకు అందించేలా హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రజారోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో మరిన్ని వినూత్న ప్రాజెక్టులను ప్రోత్సహిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.













Leave a Reply