(న్యూస్ఇన్, న్యూఢిల్లీ)
దేశ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీయే ఐక్యత భారత దేశానికి బలమన్నారు. ప్రధాని మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం, 76వ జన్మదినం సందర్భంగా వారణాసిలో నిర్వహించిన ‘వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, సాంకేతికత, స్టార్టప్లు, మౌలిక వసతులు, మహిళా సాధికారత వంటి రంగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో భారత్ కీలక పాత్ర పోషించిందని చంద్రబాబు గుర్తు చేశారు. దేశంలో రక్షణ రంగం, స్టార్టప్లు, టెక్నాలజీ, కనెక్టివిటీ వంటి రంగాల్లో భారత్ గణనీయంమైన పురోగతి సాధించిందన్నారు.

నదుల అనుసంధానం పూర్తయితే దేశ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బ్రహ్మపుత్ర, గంగా, మహానది, కావేరి, గోదావరి నదుల అనుసంధానం అవసరమన్నారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తికావడం చారిత్రక పరిణామంగా చెప్పారు.. అయోధ్యలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సీఎం కోరారు.
చంద్రబాబు హిందీలో ప్రసంగించడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. అనంతరం చంద్రబాబు, రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.












Leave a Reply