NewsInn

News in a Click

తెలంగాణా చ‌రిత్ర‌లో సెప్టెంబ‌ర్ 17కు ప్ర‌త్యేక స్థానం- సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణా చ‌రిత్ర‌లో సెప్టెంబ‌ర్ 17కు ప్ర‌త్యేక స్థానం- సీఎం రేవంత్ రెడ్డి

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్‌)

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకమైన స్థానం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మారేందుకు ఈ రోజు ప్ర‌త్య‌క‌మైంద‌ని పేర్కొన్నారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరించే పోరాటాలకు వేదికగా నిలిచిందన్నారు. సమ్మక్క–సారలమ్మల పోరాటం నుంచి రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు ప్రజా చైతన్యం కొనసాగిందని గుర్తుచేశారు.

ప్రజా పాలన అంటే కేవలం ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడం కాదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం, హక్కులను కాపాడటం, ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడటం ప్రజా పాలనలో కీలకమని వివరించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రామాణికంగా ఉండాలని అన్నారు.

రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి….

రైతు కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని, ఇందుకోసం రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం న్యాయపోరాటం కొనసాగుతోందని, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం…

మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, గృహజ్యోతి కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 1.68 లక్షల మంది మహిళలకు రూ.4,709 కోట్ల సహాయం అందించామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ రాయితీ కల్పిస్తూ మహిళల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

విద్య, వైద్య రంగాల్లో కొత్త చర్యలు...

ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని సీఎం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించామని, ఉదయం అల్పాహారం, పాలు అందించేందుకు రూ.927 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు.

మౌలిక వసతులు- ఉద్యోగాల‌పై దృష్టి….

72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని సీఎం తెలిపారు. మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ద్వారా 55 కిలోమీటర్ల పరిధిలో నదిని పునరుజ్జీవింపజేసే కార్యక్రమం చేపట్టామని వివరించారు.

2047 లక్ష్యంగా తెలంగాణ రైజింగ్…

తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, ఈవీ పార్క్ వంటి ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *