కేటిఆర్ సన్నాహక సమావేశాలు
ఎన్నికల్లో విజయం కోసం జిల్లాల వారిగా వ్యూహాలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ జిల్లాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ నేతలను సన్నధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో తెలంగాణా ప్రజలు బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థలకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారని మున్సిపల్ ఎన్నికలు పార్టీ ల గుర్తులపై జరుగనున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమైన కేటిఆర్ ఆ జిల్లాలోని మున్సిపాల్టీల వారిగా సమీక్షలు నిర్వహించారు. ఆయా మున్సిపాల్టీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలకు సన్నధం కావాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలు మన పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారని, మరోసారి రాష్ట్ర ప్రజానీకం పల్లెలు పట్టణాలకు అతీతంగా మన పార్టీ వైపు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.

పార్టీ శ్రేణులంతా శక్తి వంచన లేకుండా గులాబీజెండాకు పూర్వ వైభవం తెచ్చేందుకు సరిహద్దుల్లో పనిచేసే సైనికుల్లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ చేతకాని పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష సాక్షమని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బ తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గత 24 నెలలుగా పట్టణాల్లో నెలకొన్న సమస్యలను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ పార్టీ నేతలను కోరారు. పారిశుధ్యం నుంచి మొదలుకొని వీధీదీపాల వరకు అన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ పాలనలో పట్టణాల్లో కొత్తగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, మున్సిపాలిటీలు సమస్యలకు కేరాఫ్ గా మారాయని మండిపడ్డారు. పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు వరుసగా అన్ని జిల్లాల నేతలో కేటిఆర్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.








Leave a Reply