బీజెపి అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, స్కాంల విషయంలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీల మధ్య తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహార శైలి ఒకే విధంగా కొనసాగుతున్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని బీజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విచారిస్తూ….. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అక్రమ కేసులను బనాయిస్తోందని రాంచందర్ రావ్ ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో యాక్టింగ్ మాత్రమే జరుగుతోందని, యాక్షన్ లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో గొర్రెల పంపిణీ స్కాం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఆ స్కాంపై ఇప్పటివరకు ఎలాంటి సమగ్ర విచారణ జరగడం లేదన్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి మాత్రమే జరిగిందని కమిషన్ల విధానం మాత్రం అలాగే కొనసాగుతోందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ లిక్కర్ పాలసీలనే కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా అంగీకరిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు మభ్య పెట్టడమే ప్రధాన పని అయిపోయిందని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరింది, ఎన్ని కమిషన్లు వచ్చాయి అనే అంశాలపై పూర్తిస్థాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుపాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి, బిజెపిని గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నాను.







Leave a Reply