ఏర్పాట్లపై దృష్టి పెట్టిన పార్టీ క్యాడర్

(హైదరాబాద్,న్యూస్ఇన్)
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కమలం పార్టీ భారీ స్కెచ్ అమలు చేసేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రంలోని బీజెపి క్యాడర్ లో ఎన్నికల జోష్ పెంచేందుకు జాతీయ అధ్యక్షుడిని ఆహ్వానిస్తోంది. ఈ నెల 4వ తేదీన పాలమూరు జిల్లాలో నితిన్ నబీన్ పర్యటించ బోతున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత రాష్ట్రానికి మొదటి సారి వస్తుండడంతో బీజెపి నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి పాలమూరు తో పాటు పొరుగు జిల్లాల్లో కూడా ప్రచారానికి నితిన్ నబిన్ పర్యటనను వినియోగించుకోవాలన్న అభిప్రాయంతో కమలనాథులున్నారు. నబీన్ పర్యటనకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీజెపి శ్రేణులు ఏర్పాట్లపై ముమ్మరంగా దృష్టి సారించాయి. ఉమ్మడి జిల్లాతోపాటు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నలుమూల నుంచి పార్టీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, బూత్ అధ్యక్షులు,మండల కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు,బీజేపీ వివిధ మోర్చ అధ్యక్షులు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశానికి పార్టీ ఆహ్వానిస్తోంది. తొలిసారి తెలంగాణాకు వస్తుండడంతో జాతీయ అధ్యక్షుడి పర్యటనను విజయవంతం చేయాలని ఎంపీ డీకే అరుణ పార్టీ నేతలను కోరారు. నితిన్ పర్యటనతో పాలమూరు జిల్లాలో బీజెపికి ఎన్నికల్లో కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.





Leave a Reply