NewsInn

News in a Click

రాష్ట్రంలో ప్రతీ రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ అడిట్

హెచ్చరించినా వేగం పెంచినా వాహనాలు సీజ్

వాహనాల్లో నిబంధనల ప్రకారం స్పీడ్ గవర్నర్లు

ప్రతీ అర కిలోమీటరకూ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

ముఖ్యమంత్రి చంద్రబాబు

(అమరావతి, న్యూస్ ఇన్)

 రాష్ట్రంలో ప్రతీ రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రహదారి ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా, లేక రోడ్డు ఇంజనీరింగ్ లోపమా అన్న వివిధ అంశాలను గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రాష్ట్ర రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దటం, ప్రమాదాలను నివారించేలా క్రాష్ బారియర్లు, డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రతీ మూడు నెలలకు ఓ మారు ఈ అంశాలపై పురోగతిని సమీక్షించుకునేలా రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.  రహదారి ప్రమాదాల్లో ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉండటంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు, తిరుపతి, పలనాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉండటంపై కారణాలు ఆరా తీయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

నిబంధనల మేరకు స్పీడ్ గవర్నర్లు

అమిత వేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో స్పీడ్ గవర్నర్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే రవాణేతర వాహనాలకూ వీటిని ఏర్పాటు చేసే అంశంపై ఆలోచన చేయాలని పేర్కొన్నారు. వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇరువైపుల ప్రతీ అర కిలోమీటరు పరిధిని కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. వీటిని ఆర్టీజీఎస్‌తో అనుసంధానించటంతో పాటు వెహికిల్ ట్రాకింగ్ కోసం ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని రవాణాశాఖకు సూచనలిచ్చారు. హెచ్చరికలు జారీ చేసినా అమిత వేగంగా ప్రయాణించే వాహనాలను సీజ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడు నెలల్లో వేగ నియంత్రణపై చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

వాహనాల అల్టరేషన్లపై చర్యలు

అనధికారికంగా వాహనాల్లో మార్పు చేర్పులపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బస్ బిల్డింగ్ కోడ్ ప్రకారం అనధికార ఆల్టరేషన్స్ ఉండేందుకు వీల్లేదని అన్నారు. ఈ సమస్యను అధిగమించటానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలన్నారు. అనధికారికంగా మార్చేసిన స్లీపర్ బస్సుల కారణంగా ప్రమాదాల తీవ్రత మరింతగా పెరుగుతోందని అన్నారు. నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించడానికి కారణాలేమిటన్న దానిపై అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా రాష్ట్ర రెవెన్యూ దెబ్బతినకుండా ఏపీలోనూ మార్పు చేర్పులపై ఆలోచన చేయాలని స్పష్టం చేశారు. కేంద్రం సూచ‌న‌లు సుప్రీం ఆదేశాలను అమ‌లు చేయాల‌ని అధికారుల‌కు సిఏం సూచించారు. రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ మేరకు పోలీసు, రవాణా, ఇంజనీరింగ్, వైద్యారోగ్యం, ఎక్సైజ్ శాఖలను సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. రోడ్ సేఫ్టీ అంశాలపై విస్తృతంగా ప్రచారం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ సెన్సిటైజ్ చేసేలా సందేశాలు ఇచ్చేలా చూడాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *