NewsInn

News in a Click

గాంధీ స‌రోవ‌ర్ కు ఈ నెలాఖ‌రులోనే శంకుస్థాప‌న

కేంద్ర మంత్రుల‌కు ఆహ్వానాలు

ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌)

ఈసా.. మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లిలో ప్ర‌పంచ‌స్థాయి విద్యా సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ కేంద్రంగా నిర్మించ‌నున్నగాంధీ సరోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో స‌హా ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను ఆహ్వానించారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రుల‌ను క‌లుసుకోవ‌డంతో పాటు రాష్ట్రంలో ప‌లు ప్రాజెక్టులపైనా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం మూసీ పున‌రుజ్జీవ ప‌థ‌కంలో భాగంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మాణం చేయాలని భావిస్తున్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు విశేషాల‌ను కేంద్ర మంత్రుల‌కు వివ‌రించారు. సుస్థిర ప‌ట్ట‌ణాభివృద్ధి ల‌క్ష్యాల‌తో ప‌ర్యావ‌ర‌ణ హితంగా, స్వ‌చ్ఛ‌మైన నీటితో న‌ది ప్ర‌వ‌హించేలా మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టును చేప‌డుతున్న‌ట్లు రేవంత్ రెడ్డి వివ‌రించారు. ఇందులో భాగంగా ఈసా.. మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లిలో 1948లో జాతిపిత మ‌హ‌త్మా గాంధీ చిత‌భ‌స్మాన్ని నిమ‌జ్జ‌నం చేసిన బాపూ ఘాట్ వ‌ద్ద గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేప‌డుతున్న‌ట్లు సీఎం తెలియ‌జేశారు. గాంధీజీ ఆశ‌యాలైన శాంతి, ఐక్య‌త‌, సుస్థిరాభివృద్ధి, నిరాడంబ‌ర జీవ‌న‌శైలిని అద్దం ప‌ట్టేలా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును నిర్మించ‌నున్న‌ట్లు సీఎం తెలిపారు.

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును ప్ర‌పంచ‌స్థాయి విద్యా, సాంస్కృతిక‌, ఆధ్యాత్మ‌క‌, ప‌ర్యావ‌ర‌ణ కేంద్రంగా నిలుపుతామ‌న్నారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టులో శాంతి చిహ్నం, జాతీయ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహ‌క కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు కు ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో చేసే శంకుస్థాప‌న‌, భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని కేంద్ర మంత్రుల‌ను కోరారు.

హై స్పీడ్ రైళ్ల‌కు శంషాబాద్ కేంద్ర‌మే…….

హైద‌రాబాద్‌-చెన్నై (778 కి.మీ.), హైద‌రాబాద్‌-బెంగ‌ళూర్ (586 కి.మీ.), హైద‌రాబాద్‌-పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స‌మీపంలో 500 ఎక‌రాల స్థ‌లం కేటాయిస్తామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు తెలియ‌జేశారు. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాల‌ని ప్రారంభించాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్‌-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమ‌రావతి మీదుగా వెళుతుంద‌ని, అక్క‌డి నుంచి బంద‌రు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాల‌ని కోరారు. దాంతో డ్రైపోర్ట్ నుంచి బంద‌రు పోర్టుకు స‌ర‌కు ర‌వాణా వేగ‌వంతం అవుతుంద‌ని వివ‌రించారు. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌-పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొద‌లు పెడితే అది ట్రై జంక్ష‌న్ అవుతుంద‌ని సీఎం రైల్వే మంత్రికి వివ‌రించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల‌పై చ‌ర్చించి త్వ‌ర‌లో పూర్తి చేయాల‌ని విజ్ఙ‌ప్తి చేశారు. వికారాబాద్- క్రిష్ణా రైల్వే లైన్ ప‌నుల‌ను వెంట‌నే మొద‌లు పెట్టాల‌ని కోరారు.

రాంమోహ‌న్ నాయుడుతో…

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి అయినందున అవసరమైన పనులు చేపట్టాలని కోరారు.
కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కు పాల్వంచలో స్థలం గుర్తించినందున OLS సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్ పోర్ట్ కు ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు సిద్ధంగా ఉంద‌ని సీఎం తెలియ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *