-మానవ అక్రమ రవాణా కేసులో కీలక నేతలకు విముక్తి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ పార్టీలో కీలక రాజకీయ నేతలకు ఓ ప్రధాన కేసులో విముక్తి దక్కింది. మానవ అక్రమరవాణా కేసులో తీవ్ర మైన ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మరోసీనియర్ నేత జెట్టి కుసుమ కుమార్ లను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయ స్థానం ఈ కేసును విచారించింది. కోర్టు ముందుకు వచ్చిన సాక్ష్యాలు, వాంగ్మూలం ఆధారంగా వీరిపై నమోదు చేసిన కేసు నిరూపించలేకపోయారని కోర్టు నిర్ణయానికి వచ్చింది. దీంతో ఈ ఇద్దరకి కేసులో విముక్తి లభించింది.
కేసు ఎలా మొదలైంది…..
హైదరాబాద్లోని మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై నమోదైంది. విదేశాలకు ఉద్యోగాల పేరుతో కొందరిని పంపించేందుకు ప్రయత్నించినట్లు, ఈ ప్రక్రియలో అక్రమ మార్గాలను ఉపయోగించినట్లు ఆరోపణలపై కేసును పోలీసులు నమోదు చేశారు. కేసుపై దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు నకిలీ పత్రాల వినియోగం, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు బయటపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కేసులో అత్యంత ప్రాముఖ్యంగా భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 370 – మానవ అక్రమ రవాణా కూడా చేర్చడం ఈ కేసుకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


కేసులో తీవ్రమైన సెక్షన్లు ……
- IPC 419, 420 – మోసం, వంచన
- IPC 467, 468, 471 – నకిలీ పత్రాల సృష్టి మరియు వినియోగం
- IPC 409 – నమ్మకద్రోహం
- IPC 370 – మానవ అక్రమ రవాణా
- భారత పాస్పోర్ట్ చట్టం సెక్షన్ 12
- ఇమ్మిగ్రేషన్ చట్టం సెక్షన్ 24
దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు చార్జ్ షీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు MPs/MLAs పై విచారణ చేసే ప్రత్యేక సెషన్స్ కోర్టుకు బదిలీ అయింది.కేసులో జగ్గారెడ్డి ప్రధాన నిందితుడు (A1)గా కుసుమ కుమార్ (ఏ3)గా ఉన్నారు. కేసులో ప్రాసిక్యూషన్ తమ వాదనలు వినిపించగా, డిఫెన్స్ ఆరోపణలను ఖండిస్తూ వాదనలు వినిపించింది. ఈ కేసు విచారణ లో నిరూపించేందుకు సరిపడా ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయానికి వచ్చింది.

కోర్టు తన తీర్పులో ముఖ్యాంశాలు…..
- ఆరోపణలు నిరూపించబడలేదు
- ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు సరైనవిగా లేవు
- నిందితులపై క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు నిర్ధారించలేము
రాజకీయంగా ప్రభావం…..
ఈ కేసు నమోదైనప్పటి నుంచి రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన ఆరోపణలు తెరపైకి రావడంతో పొలిటికల్ హీట్ పెంచింది. కోర్టు జడ్జిమెంట్ తో జగ్గారెడ్డికి భారీగా ఊరట లభించింది.




Leave a Reply