NewsInn

News in a Click

వేలు మనదే..కన్ను మనదే..పొడుచుకుంటే నష్టం?

వేలు మనదే..కన్ను మనదే..పొడుచుకుంటే  నష్టం?

తుంగతుర్తి వివాదంలో పార్టీకి మరింత నష్టం జరగకుండా పీసీసీ వేగంగా స్పందించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పరిశీలకుడు గా నియమించి, వివాదంపై తుది నివేదిక సమర్పించాల్సిందిగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేసారు ఇందులో భాగంగా తుంగతుర్తి వ్యవహారంపై గాంధీభవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు.గాంధీ భవన్ లో ప్రత్యేకంగా తుంగతుర్తి కి సంబంధించిన ఇరు నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, నేతల అభిప్రాయాలను సేకరించారు. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చడంతో తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ గా స్పందించింది. ఈ నేపథ్యంలో తుంగతుర్తి ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక నాయకులు, ముఖ్య కార్యకర్తలను గాంధీ భవన్ కు పిలిపించి జగ్గారెడ్డి చర్చలు జరిపారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న జగ్గారెడ్డి,సమస్య పరిష్కారం కోసం ఓ నివేదికను పీసీసీకి అందించనున్నారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని, పార్టీకి నష్టం చేసే చర్యలు మానుకోవాలని సూచించినట్టు సమాచారం.అంతే కాకుండా తుంగతుర్తి కాంగ్రెస్‌లో పలు గ్రూపులు ఉన్నాయని,దీనివల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని పీసీసీ భావించినట్టు తెలుస్తోంది.

అసలు వివాదం ఏంటి….?

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని 9మండల కాంగ్రెస్ అద్యక్షుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అర్వపల్లి మండల అద్యక్షుడి ఎంపిక వల్ల పార్టీ నేతల మద్య వివాదం మొదలైనట్టు విశ్వసనీయ సమాచారం. మండల అద్యక్షుడి ఎంపిక విషయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. అర్వపల్లి మండల అద్యక్షుడి ఎంపికను ఎమ్మెల్యే మందుల సామేలు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే కొంత మంది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే మందుల సామేలు వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు బయల్దేరారు. గాంధీ భవన్ కు కొంత మంది వస్తున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే మందుల సామేలు వర్గం వారు దాడులకు పాల్పడ్డారు. దీంతో వివాదం మరింత ముదిరింది. గాంధీ భవన్ కు చేరుకున్న సామేలు వ్యతిరేక వర్గం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మందుల సామేలు కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఇదంతా మీడియాలో రావడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. సరిగ్గా ఇదే సమయంలో రంగంలోకి దిగిన జగ్గారెడ్డి సమస్యను ఎలాగైనా పరిష్కరించి పార్టీకి నష్టం జరగకుండా చూడాలని భావించారు. విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి వివరించారు. వెంటనే స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ను సంప్రదించి, జగ్గారెడ్డిని పరిశీలకుడిగా నియమించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు.

ఇరువర్గాలకు హితబోద….

ఇరు వర్గాల వాదనలు తెలుసుకునేందుకు రెండు రోజులు గాంధీ భవన్ లో మకాం వేశారు జగ్గారెడ్డి. మొదటి రోజు జిల్లా యంత్రాంగాన్ని మొత్తం ఆహ్వానించారు. ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సమాచారం అందించారు జగ్గారెడ్డి. శని, ఆదివారం ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపిన జగ్గారెడ్డి ఇరు పార్టీ నేతలకు కీలక సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. అర్వపల్లి మండల నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపిన జగ్గారెడ్డి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఏ ఒక్కరూ వ్యవహరించినా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని హితబోధ చేసినట్లు సమాచారం. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యమని, వ్యవస్థ పటిష్టంగా ఉంటే వ్యక్తులకు పదవులు వాటికవే వస్తాయన్నారు జగ్గారెడ్డి. పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేసిన వారికి ఆశించిన పదవులు దక్కుతాయన్నారు జగ్గారెడ్డి. అవన్నీ మర్చిపోయి బహిరంగంగా పరస్పర దాడులకు పాల్పడితే నష్టం జరిగేది పార్టీకే అనే విషయం మర్చిపోవద్దని హితబోధ చేసారు జగ్గారెడ్డి.

సామేలుకు జగ్గారెడ్డి చురకలు….

తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యే మందుల సామేలు వ్యవహారంపైన జగ్గారెడ్డి సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం పెద్ద కష్టం కాదని, రెండోసారి గెలవటం చాలా ముఖ్యమని,నియోజకవర్గంలో మనం సంపాదించుకున్న మంచితనమే రెండోసారి గెలిపిస్తుందని మందుల సామేలుకు జగ్గారెడ్డి క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. మూడు సార్లు, నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ లైన్ కు కట్టుబడి పని చేస్తారని, నియోజకవర్గ కార్యక్రమాల పట్ల గానీ, ప్రజల పట్ల గానీ అంకితభావంతో ఉంటారని గుర్తు చేసినట్లు తెలుస్తోంది. మొదటి సారి ఎమ్మెల్యే ఐన తర్వాత ప్రజల ఆదరణ చూరగొంటూ, స్థానిక నాయకుల సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి తప్ప వివాదాలతో కాదని మందుల సామేలుకు దిశానిర్దేశం చేసారు జగ్గారెడ్డి. అభివృద్ది సంక్షేమ పథకాల అమలులో ఇతర నియోజక వర్గాలతో పోటీ పడ్డప్పుడే ఒక ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు వస్తుందని, అలాంటి ప్రజాప్రతినిధులే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని మందుల సామేలుకు జగ్గారెడ్డి గుర్తు చేసినట్టు తెలుస్తోంది. చిన్న చిన్న వివాదాలు పరిష్కరించలేక రచ్చ చేసుకుంటే పోయేది పార్టీ పరువేనని, ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా చులకనగా చూసే అవకాశం ఉందని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. కన్నూ మనదే, వేలూ మనదే అయినప్పుడు పొడుచుకుంటే ఎవరికి నష్టమో తెలియదా అంటూ ఎమ్మెల్యే మందుల సామేలుకు జగ్గారెడ్డి చురకలంటిచినట్టు సమాచారం. మొత్తానికి తుంగతుర్తి వివాదంలో ఇరు వర్గాలతో చర్చలు జరిపిన జగ్గారెడ్డి తుది నివేదికను పార్టీకి సమర్పించనున్నారు.

కృష్ణ హరి.డి. సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *