పథకం పేరు, అమలు విధానంలోనూ మార్పులు
పేదలను, రాష్ట్రాలను శిక్షించేలా నూతన బిల్లు
కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
డిమాండ్ చేసిన మంత్రి సీతక్క
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మను, అమలు విధానాన్నీ మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర విధానం పేదలను, రాష్ట్రాలను శిక్షించే విధంగా ఉందని ఆక్షేపించారు.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును “వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) : VB–G RAM G”గా మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఆ బిల్లును మంత్రి సీతక్క తీవ్రంగా తప్పుబట్టార. గతంలో వంద శాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. ఇది రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమని, కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని విమర్శించారు.ఈ పథకం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దశలవారీగా బలహీనపరిచే కుట్రలకు తెరలేపుతోందని ఆరోపించారు.

ఈ పథకానికి ప్రతి ఏడాది నిధుల్లో భారీ కోత విధిస్తూ పేదల ఉపాధి హక్కును కేంద్రం కాలరాస్తోందని ఆమె మండిపడ్డారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా తెలంగాణను పేర్కొంటూ, గత ఏడాది రాష్ట్రంలో 12.5 కోట్ల పని దినాలు కల్పించగా, ఈ ఏడాది కేవలం 7.5 కోట్ల పని దినాలకే పరిమితం చేశారని వెల్లడించారు.గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
భారత రాష్ట్రపతి తెలంగాణ పర్యటన — మంత్రి సీతక్క ‘మినిస్టర్-ఇన్-వైటింగ్’గా నియామకం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు డిసెంబర్ 17 నుండి 22 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ నేపథ్యంలో, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ను రాష్ట్రపతి గారి పర్యటనకు సంబంధించి మినిస్టర్-ఇన్-వైటింగ్గా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం నియమించింది.








Leave a Reply