NewsInn

News in a Click

మిడ్జిల్ లో రాజ‌కీయం మొద‌లుపెట్టి ముఖ్యమంత్రి వరకు

మిడ్జిల్ లో రాజ‌కీయం మొద‌లుపెట్టి ముఖ్యమంత్రి వరకు

రెండు దశాబ్దాల క్రితం రాజకీయ అడుగులు మిడ్జిల్ మండలం నుంచి వేయడం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి… అనతి కాలంలోనే రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకొని ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. మిడ్జిల్ లో ఆయన వేసిన పొలిటికల్ అడుగు రెండు దశాబ్దాల్లో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించేలా చేసింది. అంతా అనుకుంటున్నట్లు…. ముఖ్యమంత్రి స్థానం దక్కించుకునేందుకు అన్ని కలిసి రాలేదు…. 20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉన్నత రాజకీయ శిఖరాన్ని చేరుకున్నారు. రాజకీయాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఎంతో మందికి కనీసం ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావడం కూడా కష్టమే. అలాంటిది పక్కా ప్రణాళికతో… అవసరానికి అనుగుణంగా రాజకీయంగా ఎత్తుకుపోయే ఎత్తులు వేస్తూ… వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ పదవులు దక్కించుకున్నారు రేవంత్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా…. రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ కు వెళ్లి పాత రోజులను గుర్తు గుర్తు చేసుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి శనివారం మిడ్జిల్ లో పర్యటించనున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు దశాబ్దాల రాజకీయ చదరంగంపై న్యూస్ఇన్ అందిస్తున్న ప్రత్యేక కథనం…

రేవంత్ రెడ్డి రాజకీయ ప్ర‌స్థానం…..

ఇచ్చిన మాటను నెరవేర్చడంలో మడమతిప్పలేదు. అంకిత భావానికి ఆప్యాయతను జోడించి అందరివాడిగా అనురాగం పంచి అతితక్కువ కాలంలో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించిన రాజకీయ నాయకుడు ఆయన. రాజకీయలలో వెన్నుతట్టి అవకాశాలు ఇప్పించే భరోసా లేకపోయినా కష్టాల కడలితో ఆత్మస్తైర్యమే ఆయుధంగా రాజకీయాల్లో దూసుకొచ్చిన చురకత్తి ఆయన. కేవలం రెండు దశాబ్దాల కాలంలో హేమాహమీలను తోసిరాజంటూ తనదైన ప్రత్యేకతతో ప్రజలు ఆదరణను అనూహ్యంగా చూరగొని అపురూపమైన అందలం ఎక్కిన చిచ్చర పిడుగు రాజకీయ నాయకుడు ఆయన. రాజకీయాల్లో వటవృక్షం లాంటి మహా నాయకులను కూకటి వేళ్లతో పెకిలించి రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి సాహసోపేత రాజకీయాలకు రోల్ మోడల్ గా నిలిచిన నాయకుడు.. ఆయన ఎవరో కాదు.. పోరాటాల పురిటిగడ్డ పాలమూరు జిల్లాలో రాజకీయ ఓనమాలు దిద్దుకుని దేశానికే పొలిటికల్ డిక్షనరీగా మారిన ఆ కీలక రాజకీయ నాయకుడే తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. రెండు దశాబ్దాల క్రితం రాజకీయాలు వినని పేరది. పాలమూరు జిల్లా మిడ్జిల్ నుంచి రేవంత్ రాజకీయ రంగ ప్రవేశానికి తొలి సోపానంగా మారింది. అక్కడ నుండి వేసిన రాజకీయ అడుగు అప్రతిహతంగా కొసాగుతూనే ఉంది. అవాంతరాలను అనుకూలంగా మార్చుకుంటూ, ముళ్లబాటను పూలబాటగా తయారు చేసుకుంటూ.. రాజ‌కీయంగా ఆయ‌న ముంద‌డుగు వేస్తున్నారు.

మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్య‌మంత్రిగా…..

కేవలం రెండు దశాబ్దాల వ్యవధిలోనే చిన్న రాజకీయ అవకాశాన్ని అతి చిన్న వయసులో అందిపుచ్చుకుని యువతకు ప్రేరణగా నిలిచారు రేవంత్ రెడ్డి. మిడ్జిల్ లో జడ్పీటీసీగా అందుకున్న విజయాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయాల్లో అరుదైన స్థాయికి ఎదిగారు రేవంత్ రెడ్డి. రెండు దశాబ్దాల కాలంలో అందివచ్చిన రాజకీయా అవకాశాలు చేజారిపోతున్నా చెదరని, బెదరని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసారు. ప్రత్యర్ధుల రాజకీయ కుట్రలకు బలవ్వకుండా తనకుతాను రీఛార్జ్ అవుతూ నూతన శక్తితో ముందుడుగు వేసారు రేవంత్ రెడ్డి. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్య్ర‌ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పేరు మారుమోగిపోయింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉంటూ కాంగ్రెస్ కంచుకోట‌గా ఉన్న కోడంగల్ లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి తొలిసారి 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల కారణంగా టీడిపీని విడిచిపెట్టారు. కోడంగ‌ల్ లో మూడో సారి 2018 లో ఓట‌మి చెంద‌డంతో మ‌ల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి రాజ‌కీయంగా మ‌రోసారి ప‌ట్టునిలబెట్టుకున్నారు. 2023 లో మ‌రోసారి కోడంగ‌ల్ లో మూడో సారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించి సీఎం ప‌ద‌విని ద‌క్కించుకున్నారు.

జ‌నం నేత‌గా….

వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి అతికొద్ది కాలంలోనే కీలక నాయకుడిగా ఎదిగిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రసిడెంట్ గా బాద్యతలు నిర్వహించిన కొద్ది రోజులకే రేవంత్ రెడ్డిలోని చురుకుదనాన్ని గమనించిన హైకమాండ్ తెలంగాణ పీసీసీ అద్యక్షుడిగా బాద్యతలు కట్టబెట్టింది. పీసిసి అద్యక్షుడిగా బాద్యతలు చేపట్టే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితిలో ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ ఐనప్పటికీ నిస్సహాయ పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యూహాలకు చిత్తవుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ అద్యక్షుడిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని, కార్యకర్తల్లో నేనున్నాననే భరోసాను తీసుకు రాగలిగారు రేవంత్ రెడ్డి. దీంతో కృంగి కృషించి పోయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన జవసత్వాలు నింపి కొత్త జోష్ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి.

కార్యకర్తల నమ్మకాన్ని వమ్ముచేయకుండా అనతి కాలంలోనే మహా వటవృక్షం లాంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విధంగా త‌న వ్యూహాల‌తో దెబ్బ‌కొట్టి రాజకీయాల్లో త‌న మార్క్ వేసుకున్నారు. . తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును రాజకీయంగా ఎదుర్కొనే పార్టీ గానీ, నాయకుడు గానీ లేడని చర్చ జరుగుతున్న తరుణంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రేవంత్ రెడ్డి పై అదిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని, తెలంగాణ ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ముచేయకుండా వినూత్న రాజకీయ నాయకుడిగా అవతరించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అందించిన అమూల్యమైన అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఇదంతా కేవలం రెండు దశాబ్దాల అతి తక్కువ రాజకీయ ప్రయాణంలో చేసి చూపించిన సాహసోపేత రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. మిడ్జిల్ లో మొదలైన రాజకీయ ప్రయాణం నేటి వరకూ అప్రతిహతంగా కొనసాగుతుందంటే రాజకీయాలపట్ల, ప్రజాసేవ పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న అంకితభావాన్ని సాక్షాత్కరిస్తోంది. తన రాజకీయ సోపానానికి వేదికైన మిడ్జిల్ ప్రజలకు, మిడ్జిల్ మట్టికి కృతజ్ణతలు తెలిపేందుకు రేపు శనివారం మిడ్జిల్ లో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు.

కృష్ణహరి. స్పెషల్ కరస్పాండెంట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *