(బెంగుళూరు,న్యూస్ఇన్)
ఇటీవల వడగాలుల ప్రభావం తీవ్రంగా పెరిగిందని ఇది జాతీయ విపత్తు కదా అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ సంతోష్ కుమార్ ప్రశ్నించారు.పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై పోరాటం విషయంలో భారతదేశంలో అద్భుతమైన విధానాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఎందుకు రావడం లేదు? కచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం ఆసన్నమైందని సంతోష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.బెంగళూరులోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIMB) వేదికగా జరిగిన ‘క్లైమేట్ ఇన్నోవేషన్ సమిట్ 2026’ లో ఆయన ప్యానెల్ స్పీకర్గా పాల్గొని పలు కీలక అంశాలను లేవనెత్తారు.
సదస్సులో సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. “ఢిల్లీలో రూపొందించే ప్రభుత్వ విధానాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న తెలంగాణ రైతుకు లేదా కర్ణాటక విద్యార్థికి మధ్య ఉన్న అగాధమే మన ముందున్న అతిపెద్ద సవాలు” అని వ్యాఖ్యానించారు. ఎటువంటి ప్రభుత్వ సర్క్యులర్లు లేకుండానే, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ద్వారా 4.4 కోట్ల మంది భాగస్వామ్యంతో 19.6 కోట్ల మొక్కలు నాటడాన్ని ఆయన ఉదాహరణగా చూపిస్తూ, పర్యావరణ పోరాటం అనేది ఒక ప్రజల ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్నారు.
వడగాల్పులు జాతీయ విపత్తు కాదా?

దేశంలో ఎప్పుడూ లేని విధంగా 2026 ఏప్రిల్ నెలలో 6 నగరాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయని సంతోష్ కుమార్ గుర్తుచేశారు. వరదలు, భూకంపాల కంటే కూడా వడగాల్పుల వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోందని, అయినప్పటికీ SDRF/NDRF నిధుల పరిధిలో వడగాల్పులను విపత్తుగా గుర్తించకపోవడం ప్రభుత్వ విధానాల వైఫల్యమన్నారు. రాబోయే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకునేలా అన్ని రాష్ట్రాలు ఒత్తిడి తేవాలని కోరారు.
కార్బన్ మార్కెట్లలో సామాన్యులకు చోటు
భారతదేశం కొత్తగా తీసుకొస్తున్న కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ (CCTS) కేవలం బడా కార్పొరేట్ సంస్థలకే పరిమితం కాకూడదని సంతోష్ కుమార్ సూచించారు. పర్యావరణాన్ని కాపాడే స్థానిక పంచాయతీలు, కమ్యూనిటీ ఆధారిత ప్రాజెక్టులకు కూడా కార్బన్ మార్కెట్లో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే దేశంలోని ప్రతి కాలేజీ క్యాంపస్ను ఒక ‘క్లైమేట్ గవర్నెన్స్ యూనిట్’గా మార్చాలని సూచించారు.
కార్బన్-నెగెటివ్ సదస్సు…!
భారతదేశంలోనే తొలిసారిగా ఒక క్లైమేట్ సదస్సును ‘కార్బన్-నెగెటివ్’ ఈవెంట్గా మార్చిన ఘనతను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దక్కించుకుంది. సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరి పేరుతో ‘పునర్వసు ప్రాజెక్ట్’ కింద జియో-ట్యాగ్ చేయబడిన వెదురు మొక్కలను నాటారు. సాధారణ చెట్ల కంటే వెదురు నాలుగు రెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని, 35% ఎక్కువ ఆక్సిజన్ను ఇస్తుంది. ఈ మొక్కల పెంపక బాధ్యతను 1,000 రోజుల పాటు తమ సంస్థ తీసుకుంటుందని సంతోష్ కుమార్ ప్రకటించారు.2026 డిసెంబర్లో హైదరాబాద్ HICC వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ క్లైమేట్ యాక్షన్ వీక్’ కు విచ్చేయాల్సిందిగా సదస్సు భాగస్వాములందరినీ సంతోష్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు.
ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్…
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ లాభాపేక్షలేని సంస్థ. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో, మాజీ డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ఈ సంస్థ 33 దేశాల్లో 22 వేలకుపైగా వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది.











Leave a Reply