భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు
ఎన్టీఆర్, వాజ్ పెయి గుర్తండేలా స్మృతివనాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
(అమరావతి,న్యూస్ఇన్)
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ ప్రవేశపెట్టిన సంస్కరణలే అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశానికి వాజ్ పేయి సుపరిపాలన పరిచయం చేశారని కొనియాడారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో వాజ్పేయి విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సుపరిపాలన దినోత్సవం బహిరంగ సభలో ప్రసంగించారు. అంతక ముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు.

వాజ్పేయి గుర్తుండేలా స్మృతీవనం
వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు రాజధానిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కోరారు. చరిత్ర గుర్తుంచుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈ నెల 11 నుంచి అటల్ మోదీ సుపరిపాలన యాత్రను బీజేపీ చేపట్టింది. 26 జిల్లా కేంద్రాల్లో వాజ్ పేయ్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. మూడు పార్టీల నేతలంతా కలిసి అటల్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేశారు. ఆయన చరిత్ర, చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తుండేలా స్మృతీవనం ఏర్పాటు చేస్తాం’ అని సీఎం అన్నారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలనికి బీజం వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ‘ఎన్టీఆర్, వాజ్పేయి చాలా చనువుగా ఉండేవారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ రద్దు చేస్తే అద్వానీ, వాజ్ పేయి ఎన్టీఆర్ను ముందుకు నడిపించారు. నేషనల్ ఫ్రంట్ ద్వారా యాంటీ కాంగ్రెస్కు బీజం వేసి ప్రభుత్వాన్ని కూడా ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, వాజ్ పేయి ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం’ అని స్పష్టం చేశారు.

దేశ ప్రగతికి వాజ్పేయి గట్టి పునాదులు
మనదేశంలో రోడ్లు గతంలో అధ్వాన్నంగా ఉండేవి. నేను చిన్నదేశమైన మలేషియాకు వెళ్లి అక్కడున్న 8 వరుసల రహదారులను చూసి వాజ్ పేయ్కి వివరించాను. ఇంతపెద్ద దేశంలోనే మనం మంచి రోడ్డు వేయలేకపోతున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో మొదటి సారి చెన్నై-తడకు జాతీయ రహదారి నిర్మించారు.ఏ దేశం కంటే మనం తక్కువ కాదని చెప్పి ఆచరణలో పెట్టిన వ్యక్తి వాజ్ పేయ్. రోడ్లు, ఎయిర్పోర్టులు, వంటి వివిధ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. హైదరాబాద్లో గతంలో చిన్న ఎయిర్ పోర్టు ఉండేది… పెద్దగా విమానాలు వచ్చేవి కావు. విమానాశ్రయం అభివృద్ధి కోసం వాజ్ పేయిని కలిసిన వెంటనే ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చారు. హైదరాబాద్కు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు వచ్చిందంటే దానికి కారణం వాజ్ పేయి. హైదరాబాద్లో హైటెక్ సిటీ భవనాలను వాజ్ పేయి ప్రారంభించారు. హైటెక్ సిటీతో సైబరాబాద్ ప్రారంభమైంది. క్వాంటమ్ వ్యాలీతో అమరావతి ప్రారంభమవుతోంది.
మెడికల్ కాలేజీలు కట్టే వారిని జైల్లో పెడతారా.?

అమరావతి, పోలవరం, హైవేలు వంటి కీలక ప్రాజెక్టులకు మోదీ, కేంద్రం సహకరిస్తోంది. రాష్ట్రం మొన్నటి వరకు వెంటిలేటర్పై ఉంది. ఇప్పుడు నిలదొక్కుకుని ముందుకెళ్తోంది. వాజ్ పేయి చేసిన అభృద్ధి, చూపిన దారి అందరికీ స్ఫూర్తి. పీపీపీ విధానం గురించి తెలియని వారు ప్రైవేట్ పరం అంటూ మాట్లాడుతున్నారు.పీపీపీ విధానంలో రోడ్డు వేస్తే, ఎయిర్ పోర్టు కడితే ప్రైవేట్ వ్యక్తులకు చెందదు.. ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. నియమాల ప్రకారం కొన్ని సంవత్సరాలు నిర్వహించి ప్రభుత్వాలకు అప్పగిస్తారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. అభివృద్ధి చేసే వారిని జైల్లో పెడతామనే వారిని ఏమనాలో ప్రజలే ఆలోచించుకోవాలి.








Leave a Reply