NewsInn

News in a Click

అగ్ని ప్ర‌మాదం… ఫోన్ ట్యాపింగ్ రికార్డులు ధ్వంసం

కాంగ్రెస్ , బీఆర్ ఎస్ లు ఒక్క‌టే… రాంచంద‌ర్ రావ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు రెండూ ఒక‌టే అని వేర్వేరు కాద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్. రాంచంద‌ర్ రావ్ ఆరోపించారు. ఓటు కు నోటు కేసులో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ ఎస్ కాపాడింద‌ని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌స్తుతం రేవంత్ బీఆర్ ఎస్ నేత‌ల‌ను కాపాడుతున్నార‌ని విమ‌ర్శించారు.
తాజాగా హైద‌రాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో చోటు చేసుకున్న అగ్ని ప్ర‌మాదం కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తోంద‌న్నారు. దీన్ని ఒక్క ప్ర‌మాదంగా చూసి వ‌దిలి వేయ‌లేమ‌న్నారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కీల‌క కేసుల‌కు సంబంధించిన హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు, డిఎన్ ఏ రిపోర్టులు, వాయిస్ శాంపిల్స్ స‌హా ఎన్నో డిజిట‌ల్ ఎవిడెన్స్ లు ఆ ల్యాబ్ లో ఉండ‌డం ఎన్నో అనామానాల‌కు తావిస్తోంద‌న్నారు.

ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఉన్న చోటే అగ్నిప్రమాదం జరగడం, ఫైళ్లు కాలిపోవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఇలాంటి ప్ర‌మాదాలు గ‌తంలో కూడా జ‌రిగాయ‌న్నారు. సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం జరిగి అనేక కీలక ఫైళ్లు తగలబడ్డాయి. ఇప్పుడు కేసుల విచార‌ణ‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్ర‌మాదానికి గురైంది దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌న్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కదారి పట్టించడానికే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం కుట్ర పూరితంగా జరిగిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది బిజెపి నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా, మా పార్టీ రాష్ట్ర నాయకులపై, జాతీయ నాయకులపై కూడా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో కాంగ్రెస్ పార్టీకి నష్టమేమీ లేదన్న భావనతోనే, ఈ అగ్నిప్రమాదాన్ని కుట్రగా నిర్వహించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *