‘జగ్గన్న’ సహనం @ జూలై 30 – విడుదల
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా రాజకీయాల్లో మాస్ లీడర్ గా పేరున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మార్చి 14వ తేదీన ఈ పోస్టు చేసినట్లు తెలస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా… ఆయన తీసుకునే నిర్ణయం ఏమిటో అన్న చర్చ మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంతో పాటు, తెలంగాణా ఆవిర్భావం తరువాత కూడా ఆయన అదే దూకుడు కొనసాగిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినా…ఆ తరువాత 2018 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. 2023 ఎన్నికల్లో స్వల్ప తేడాతో మరోసారి మాజీగా మారారు. ప్రభుత్వం ఏర్పాటైనా కీలక పదవులు వరిస్తాయని భావించినా…… పార్టీలో ఉన్న రాజకీయాల కారణంగా జగ్గన్నకు పెద్దగా ప్రాధాన్యత దక్కకుండా పోయింది. తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డి టీజీ ఐఐసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఇక అప్పటి నుంచి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటిస్తున్న జగ్గారెడ్డి తన సతీమణిని రాజకీయంగా నియోజకవర్గంలో ప్రమోట్ చేస్తున్నారు.

ఐఐసీ చైర్మన్ పదవి దక్కి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తున్నాయి. 2024 జూలై 11న ఆమె చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పదవి కాలంతో చైర్మన్ పదవులను భర్తీ చేయడంతో ఈ ఏడాది జూలై నాటికి ఆమె పదవీ కాలం పూర్తి కానుంది. అదే నెలల 30వ తేదీన తన మనసులోని మాట చెబుతానంటూ సహనం@జూలై 30 అని క్యాప్షన్ తో ఓ ఫోటోను ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. ఇది ఏమిటన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. నిర్మలా జగ్గారెడ్డి పదవీ కాలం ముగిసేంత వరకు సైలెంట్ గా ఉండి ఆ తరువాత తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణకు జగ్గారెడ్డి సిద్ధం అవుతున్నారా….నిర్మాలా జగ్గారెడ్డికి మరోసారి చైర్మన్ పదవి దక్కుతుందా లేదా అని చూసి తన వ్యూహాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారా అన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.
సంగారెడ్డిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు….

రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డితో ముందుగా విభేధించినా ఆ తరువాత మారిన పరిస్థితులతో సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పాత కాంగ్రెస్ సీనియర్ నేతల జాబితాలో నే జగ్గారెడ్డిని కూడా సీఎం రేవంత్ వేశారు. ఉన్నారు. రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలన్న అభిప్రాయంతోనే జగ్గారెడ్డి సతీమణికి చైర్మన్ పదవి వరించింది. కొన్ని రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జగ్గారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లను ప్రతిపాదించారు. ఇద్దరిలో కనీసం ఒక్కరికైనా రాజ్యసభ స్థానం ఇవ్వాలని కోరారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన జెట్టి కుసుమకుమార్ కు, మరో సీనియర్ నేత విహెచ్ పేర్లను పరిశీలించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ హై కమాండ్ ముందు తన ప్రతిపాదనలు ఉంచారు.కానీ ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పట్టించుకోలేదు.
జగ్గారెడ్డి పోస్టు దేనికి సంకేతం….
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పటికే కాంగ్రెస్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకునేందుకు 25వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. జగ్గన్న కూడా సహనం@జూలై 30 జగ్గారెడ్డి అని ఓ తేదీని ప్రత్యేకంగా ప్రస్తావించడం దేనికి సంకేతమో అంతు చిక్కడం లేదు. రంజాన్ సందర్భంగా జగ్గారెడ్డి ఇచ్చిన ఇఫ్తార్ విందుకు మంత్రులను ఆహ్వానించడంతో వారంతా ఇఫ్తార్ విందుకు హాజరై జగ్గారెడ్డి పై ప్రశంసలు కురిపించారు.మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో అడుగు ముందుకేసి జగ్గారెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు






Leave a Reply