NewsInn

News in a Click

కొండా సురేఖ‌ను బుజ్జ‌గింపులు-పీసీసీ చీఫ్ వ‌ద్దంటున్న రేవంత్

కొండా సురేఖ‌ను బుజ్జ‌గింపులు-పీసీసీ చీఫ్ వ‌ద్దంటున్న రేవంత్

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కు గురైన కొండా సురేఖ‌ను అధిష్టానం బుజ్జ‌గించే ప‌నిలో ప‌డింది. కొద్ది రోజుల క్రితం కొండా సురేఖ‌ను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించిన త‌రువాత కొండా సురేఖ కాంగ్రెస్ పై విరుచుకు ప‌డుతార‌న్న అంచ‌నా రాజ‌కీయ వ‌ర్గాలు వేసినా….సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్ద‌ల‌తో చ‌ర్చించి బ‌హిరంగా విమ‌ర్శ‌లు చేయ‌కుండా ముందు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టికీ అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి కొండా రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై అత్యంత స‌న్నిహితుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతుండ‌డంతో పార్టీ హై క‌మాండ్ రంగంలోకి దిగింది.

కొండా సురేఖ కు మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగిన స‌మ‌యంలో బీసీ సామాజిక వ‌ర్గాల‌న్నీ ఆమెకు ఆండ‌గా నిలిచాయి. అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన నేత‌లు ముఖ్య‌మంత్రి తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసినా ప‌ట్టించుకోని సీఎం…ఓ బీసీ మ‌హిళ‌ను మంత్రి వ‌ర్గం నుంచి ఎలా తొల‌గిస్తార‌ని ప్ర‌శ్నించాయి. మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించిన త‌రువాత విప‌క్ష పార్టీలు కూడా కొండా వ్య‌వ‌హారాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్త‌న్నాయి.

ఈ నేప‌థ్యంలో మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ కూడా ఉంటుంద‌న్న సంకేతాల‌తో పార్టీ హై క‌మాండ్ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కొండా సురేఖ‌కు ఫోన్ చేసి బుజ్జ‌గించారు. ఢిల్లీ వ‌స్తే త‌దుప‌రి రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిద్దామ‌ని కొండాను ఢిల్లీకి ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించిన త‌రువాత రాజ‌కీయంగా కొండా కుటుంబానికి ప్రాధాన్య‌త త‌గ్గిపోవ‌డంతో అందుకు ప్ర‌త్యామ్నాయంగా చేప‌ట్టాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై కాంగ్రెస్ హై క‌మాండ్ కూడా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ సంద‌ర్భంగా పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ కు క్యాబినెట్లో చోటు ద‌క్కుతుంద‌ని ప్ర‌చారం ఉంది. ఈ నేప‌థ్యంలో కొండాకు ప్ర‌త్యామ్నాయంగా పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇవ్వాల‌న్న అభిప్రాయంతో కాంగ్రెస్ హై క‌మాండ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ అభిప్రాయాన్ని పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు స‌మాచారం. మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గిస్తే పీసీసీ చీఫ్ ఇవ్వ‌డం స‌మంజ‌సం కాద‌న్నవాద‌న‌ను త‌న అనుచ‌రుల‌తో పార్టీ పెద్ద‌ల‌కు స‌మాచారం చేరవేసిన‌ట్లు తెలుస్తోంది.పీసీసీ చీఫ్ ప‌ద‌వి కొండా సురేఖ‌కు ద‌క్కితే రాజ‌కీయంగా మ‌రింత వివాద‌స్ప‌దంగా మారే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాన్ని పార్టీ పెద్ద‌ల ముందు ఉంచిన‌ట్లు తెలుస్తోంది. అందుకు ప్ర‌త్యామ్నాయంగా ఇత‌ర ప‌ద‌వులు కూడా ఆలోచించాల‌ని కోరుతున్న‌ట్లు స‌మాచారం. దీంతో పార్టీ హై క‌మాండ్ సానుకూలంగా ఉన్నా కొండా సురేఖ‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్కుతుందా లేదా అన్న‌ది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *