(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో కలిసి ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం కోరారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్లో ఉన్న అంశాలపై ఎంపీలకు మహాత్మాజ్యోతిబా పూలే ప్రజా భవన్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ను సోమవారం ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ జనాభాలో 10 శాతం జనాభా ఆరు మహా నగరాల్లో ఉందని, అయితే ఈ నగరాలు 25 శాతం జీడీపీ కలిగి ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని… ఎంపీలు ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఐఐఎం మంజూరుకు విజ్ఞప్తి చేయాలని సీఎం సూచించారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం, మెట్రో ఫేజ్-II విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని సీఎం ఎంపీలకు వివరించారు. ఇందుకు సంబంధించి SBICAPSని కన్సల్టెంట్గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని ఎంపీలకు సీఎం సూచించారు.మూసీ పునరుజ్జీవనం పనుల్లో మొదటి దశ టెండర్ల దశకు వచ్చిందని సీఎం తెలిపారు. ఈ పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్ర అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సి ఉందన్నారు.
అంతరాష్ట్ర నదీ జలాల విషయమై ఇటీవల కర్ణాటకలో జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చించిన అంశాలను సీఎం ఎంపీలకు వివరించారు. ఈ విషయంపైనా ఎంపీలు కేంద్ర మంత్రిని కలవాలని సీఎం సూచించారు.శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబయిలకు వెళ్లే బుల్లెట్ రైళ్లకు సంబంధించి ఎలైన్మెంట్లు కొలిక్కివచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందించడానికి ఢిల్లీ తెలంగాణ భవన్లో కోఆర్డినేషన్ కు ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ను నియమించామని సీఎం చెప్పారు.












Leave a Reply