(హైదరాబాద్, న్యూస్ఇన్)
తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ స్కూల్ ను దేశంలోనే ఆదర్శ వంతమైన విద్యా సంస్థగా తీర్చి దిద్దాలనీ డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS) అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై సి.వి. ఆనంద్ అధ్యక్షతన సొసైటీ కమిటీ సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణ పనుల్లో జరిగిన జాప్యంపై డీజీపీ సి.వి. ఆనంద్ తీవ్ర అసంతృప్తి,వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, ఆలస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆయన ఆదేశించారు. పాఠశాల రెండో విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇప్పటివరకు సాధించిన పురోగతిపై డిజిపి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో మొత్తం 360 మంది విద్యార్థుల్లో 184 మంది పోలీస్ కుటుంబాలకు చెందినవారు, 176 మంది నాన్-పోలీస్ కుటుంబాలకు చెందినవారు ఉన్నట్లు సమావేశంలో వెల్లడించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో అందిస్తున్న నాణ్యమైన విద్యపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని సభ్యులు అభిప్రాయపడ్డారు.

విద్యతో పాటు అత్యాధునిక మౌలిక వసతులు, సురక్షితమైన విద్యా వాతావరణం, ఆధునిక బోధనా పద్ధతులను కల్పించడంతో పాటు క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సూచించారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందడంతో పాటు మాదకద్రవ్యాలు వంటి సామాజిక దురలవాట్లకు దూరంగా ఉండే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.పిల్లలు సురక్షిత వాతావరణంలో విద్యనభ్యసిస్తారనే నమ్మకం తల్లిదండ్రుల్లో ఉందని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని డీజీపీ అన్నారు.
ప్రతి అంశంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని డిజిపి అధికారులకు సూచించారు.












Leave a Reply