(న్యూస్ఇన్,హైదరాబాద్)
రాఖీ పౌర్ణమి సందర్భంగా 5 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసి ప్రకటించింది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 27వ తేదీ నుంచి 31 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.గత ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులను నడిపించగా, ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 240 బస్సులను అదనంగా పెంచి మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

గత ఏడాది ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు 3.68 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించగా, అందులో 2.51 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీ ఉన్న ప్రాంతాలకు అదనపు బస్సులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.రాఖీ పౌర్ణమి, తిరుగు ప్రయాణాల రద్దీ నేపథ్యంలో అవసరమైన చోట అదనపు బస్సులను నడపడంతో పాటు ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.











Leave a Reply