
(న్యూస్ఇన్, న్యూఢిల్లీ)
వచ్చే ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం దేశంలో నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ, మహిళా రిజర్వేషన్లపై తీసుకుంటున్న నిర్ణయాలతో చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాజా రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరగా నియోజకవర్గాల పెంపుకు సిద్ధం అవుతుందన్నారు. తద్వారా చిన్న రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో పెద్ద రాష్ట్రాలు రాజకీయంగా మరింత బలపడుతాయన్నారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే అమలు చేసే అవకాశం కూడా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీడబ్లూసీ సమావేశంలో కూడా నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో అభిప్రాయాలు అందాయని, తన అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించినట్లు సీఎం తెలిపారు. నియోజకవర్గాల పెంపు పార్టీల సమస్య కాదని ప్రాంతీయ సమస్య అని చెప్పారు. ఆర్ధిక ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు చేయవచ్చని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ పెడుతున్న మెలికతో రాజకీయ స్వార్ధం ఉందని సీఎం అనుమానాలు వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో అన్యాయం జరిగితే తాము సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. ఎలా పెంచాలన్నది చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, ఇప్పుడున్న స్థానాల్లో 181 సీట్లను మహిళలకు కేటాయిం చే అవకాశం కూడా ఉందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేసేందుకు ప్రయత్నించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అంశాన్ని రేవంత్ గుర్తు చేశారు.








Leave a Reply