(హైదరాబాద్, న్యూస్ఇన్)
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు స్వేచ్ఛ లభించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్నాలు నిర్వహించేందుకు, సచివాలయానికి వెళ్లేందుకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిస్థితులు మారాయని పేర్కొన్నారు.
యువత, ఉద్యోగులు, ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛతో కూడిన పాలన అని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛ లేదన్న ఆగ్రహంతోనే ప్రజలు కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారని జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ప్రజలు వాటి ఫలాలను అనుభవిస్తున్నారని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 250 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల జారీ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించిన ఆయన.. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు వైద్య చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీతో పాటు ఉద్యోగాల భర్తీ చేపట్టామని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో సుమారు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని జగ్గారెడ్డి తెలిపారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ జరగలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు.
“కేటీఆర్ పద్ధతిగా మాట్లాడాలి. అధికారం కోల్పోయిన తర్వాత ఆందోళన చెందుతున్నారు” అని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలోనూ బీఆర్ఎస్ను ఆయన సవాల్ చేశారు. పదేళ్లలో నిర్మించిన ఇళ్లను చూపించాలని, తాము నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను చూపిస్తామని అన్నారు.
ప్రభుత్వ పథకాలపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి.. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.












Leave a Reply