(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని రేవంత్ రెడ్డి అన్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన దూరదృష్టితో దేశం ఆహార కొరత నుంచి ఆహార ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుందన్నారు.

దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో సోనియా గాంధీ హయాంలో ఆహార భద్రత చట్టం తీసుకొచ్చారని రేవంత్ గుర్తు చేశారు. పేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేయడం, పీడీఎస్ ద్వారా నిత్యావసర సరుకులు అందించడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పాలనలోనే ప్రారంభమయ్యాయని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3.48 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, దీనికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలే పునాది అని చెప్పారు.
రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలి సంతకం చేశారని రేవంత్ పేర్కొన్నారు. విద్యుత్ బకాయిలు రద్దు చేయడంతో పాటు రైతులపై ఉన్న కేసులను ఎత్తివేసి వారి గుండెల్లో వైఎస్ చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు.

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ ప్రభుత్వం పునాది వేసిందని, ప్రాణహిత-చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ వంటి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారని చెప్పారు. వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల, ఎస్ఎల్బీసీ పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, వాటిని పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని ప్రకటించారు.రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన జీవిత లక్ష్యమని వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. ఆ కోరిక నెరవేరకుండానే వైఎస్ మరణించారని అన్నారు.












Leave a Reply