NewsInn

News in a Click

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. వెయ్యి వైఫల్యాలు: కేటీఆర్

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. వెయ్యి వైఫల్యాలు: కేటీఆర్

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్)

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ తరఫున రూపొందించిన చార్జిషీట్‌ను తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.ఇది పాలన కాదు.. ప్రజాపీడన. తెలంగాణకు పట్టిన శనికి వెయ్యి రోజులు నిండాయి అంటూ కేటీఆర్ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ఆర్థిక, వ్యవసాయ, విద్య, ఉద్యోగాలు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, హైదరాబాద్ అభివృద్ధి, శాంతిభద్రతలు ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ.. రైతు భరోసా సకాలంలో అందకపోవడం, యూరియా కొరత, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు, రైతు బీమాకు సంబంధించిన సమస్యలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని కేటీఆర్ అన్నారు. రైతులకు యూరియా కోసం మళ్లీ క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం కొత్తగా ఒక్క ప్రాజెక్టు చేపట్టలేద‌న్నారు. సుంకిశాల, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న ఘటనలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ ఉద్యోగాల భర్తీ విషయంలో స్పష్టత లేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించలేదని కేటీఆర్ విమర్శించారు. పీఆర్సీపై నిర్ణయం తీసుకోలేదని, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడుతూ.. నగరంలో శాంతిభద్రతలు, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టు రద్దు, విద్యుత్ కోతలు, హైడ్రా చర్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం హైద‌రాబాద్ అభివృద్ధిని తిరోగ‌మ‌నంలో న‌డిపిస్తుంద‌న్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిందంటూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలోని మంత్రుల మధ్య విభేదాలు బహిర్గతం కావడానికి అవినీతి, కుంభకోణాల్లో వాటాలే కారణమని వ్యాఖ్యానించారు. వెయ్యి రోజుల పాలనలో దాదాపు 30 స్కామ్‌లను తమ చార్జిషీట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్‌ఎస్ ఎండగడుతుందని కేటీఆర్ తెలిపారు. వెయ్యి రోజుల పాలనపై ప్రకటించిన తమ కార్యాచరణ కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *