NewsInn

News in a Click

కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు…బీసీలు ఏకమవుతారంటూ హెచ్చరిక

కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు…బీసీలు ఏకమవుతారంటూ హెచ్చరిక

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే బీసీ వర్గాలు ఏకమయ్యే అవకాశం ఉందని ఆమె హెచ్చ‌రించారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సురేఖ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేసి చర్యలు తీసుకోవాల‌నుకోవ‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. మహిళలు స్వతంత్రంగా ఆలోచించి, స్వతంత్రంగా జీవించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతుంటారని గుర్తు చేశారు. అలాంటప్పుడు తన కుమార్తె వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల విషయంలో తనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎందుకు వస్తోందని ఆమె ప్రశ్నించారు.

ఖర్గేను కలిసి వివరణ ఇచ్చిన కొండా సురేఖ….

ఈ వివాదానికి సంబంధించి ఏఐసీసీ అధ్య‌క్షులు మల్లికార్జున ఖర్గేను తాను కలిసినట్లు కొండా సురేఖ తెలిపారు. తన వైపు నుంచి పూర్తి వివరణను ఖర్గేకు అందించానని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినా దొర‌క‌లేద‌న్నారు. తనపై చర్యల గురించి ఆలోచించే ముందు ఇతర అంశాలపై కూడా పార్టీ నాయకత్వం దృష్టి సారించాలని కొండా సురేఖ అన్నారు. పార్టీలో అందరికీ ఒకే న్యాయం ఉండాలని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై కూడా కొండా సురేఖ ప్రశ్నలు సంధించారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎలా చెబుతారని ఆమె నిలదీశారు. పార్టీ నియమ నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాల్సిన అవసరం ఉంటుందున్నారు. ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలు, వారి వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సభ్యులకు సంబంధించి కమిషన్ల వ్యవహారాలపై పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆ అంశాలపై బ‌హిరంగంగా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, పార్టీలో ఆ విష‌యాల‌పై చర్చ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.

రెడ్డి నాయకులపై చర్యలు లేవా…..

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. తన విషయంలో మాత్రమే కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. తనపై పార్టీ చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని కొండా సురేఖ వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

కొత్త చర్చకు దారితీసిన కొండా వ్యాఖ్యలు….

కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి చర్చకు తెరలేపాయి. పార్టీ క్రమశిక్షణ, నాయకుల వ్యక్తిగత వ్యాఖ్యలు, సామాజిక సమీకరణాల అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కొండా సురేఖ, తనపై చర్యలు తీసుకోవద్దని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *