(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపుతో సీఎం యోగీ, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆచరణలోకి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇంధన వినియోగంలో పొదుపు చేసేందుకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రదాని మోడీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్య నాత్ కూడా అప్పుడే ఇంధన వనరుల వినియోగం తగ్గించుకునేలా చర్యలు చేపట్టారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర మైన యూపీలో ముఖ్యమంత్రి యోగి తన వాహన కాన్వయ్ ను సగానికి తగ్గించుకున్నారు.

మంత్రులు, ఉన్నతాధికారు వాహన శ్రేణి తక్షణమే 50 శాతం తగ్గించాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు వారానికి ఒకసారి తప్పనిసరిగా ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని సూచించారు.‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతిని ప్రోత్సహించాలని సీఎం యోగి నిర్ణయించారు. పెద్ద స్టార్టప్లు, ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి వారానికి రెండు రోజులు ఇంటి నుండి పనిచేసే వెసులుబాటు కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సమావేశాలను వర్చువల్ విధానంలోనే నిర్వహించాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగంపై కూడా పలు సూచనలు యోగి చేశారు. ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ సంస్థల్లో అనవసరంగా విద్యుత్ వినియోగం ఉండరాదని సూచించారు. సముదాయాలు రాత్రి 10 గంటల తర్వాత డెకోరేషన్ అలంకరణలను తీసి వేయాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేలా అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఆరు నెలల పాటు అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని ఆయన కోరారు. విదేశీ పర్యటనలు చేయవద్దని మోడీ పిలుపునిస్తే….యోగీ ఉత్తరప్రదేశ్లోని చారిత్రక కోటలు, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ‘విజిట్ మై స్టేట్’ ప్రచారాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

హోటళ్లు, రెస్టారెంట్లతో చర్చించి తక్కువ నూనెతో కూడిన ఆహార పదార్థాలను ప్రోత్సహించాలని సూచించారు. సహజ వ్యవసాయం, గోశాలల ద్వారా లభించే ఎరువుల వాడకాన్ని పెంచాలని వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్థిక సుస్థిరత కోసం అనవసరమైన బంగారు కొనుగోళ్లను మానుకోవాలని యోగి విజ్ఞప్తి చేశారు. పండుగలు, వివాహ సమయాల్లో స్థానిక చేతివృత్తుల వారు తయారు చేసిన వస్తువులను, GI ట్యాగ్ పొందిన ఉత్పత్తులను బహుమతులుగా ఇవ్వాలని కోరారు. ఇది స్థానిక పారిశ్రామికవేత్తలకు, స్వయం సహాయక బృందాలకు అండగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ యంత్రాంగం నుండి సామాన్య పౌరుల వరకు అందరూ బాధ్యతగా వ్యవహరించడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.











Leave a Reply