(అమరావతి, న్యూస్ఇన్)
ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో ఓ సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ఆవిష్కృతమైంది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, గన్నవరంలోని మేధా టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన 1 ఎస్, 1 క్యూ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. క్వాంటం టెక్నాలజీకి అమరావతిని లాంచ్ పాడ్గా మారుస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించిన అనంతరం క్వాంటం రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్ధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..”ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీని ప్రారంభించటం సంతోషంగా ఉంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలీటీ, మేథాటవర్స్లో 1 క్యూ పేరిట మరో క్వాంటం సిస్టం ఏర్పాటు చేశారు. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను. క్వాంటం సైన్స్ వంద ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రపంచ క్వాంటం దినోత్సవం రోజున దీన్ని సాకారం చేసుకుని చరిత్ర సృష్టించాం. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించుకున్నాం.

క్వాంటం టెక్నాలజీని పరిశోధకులకు, కంపెనీలకు, విద్యార్ధులకు అందుబాటులో ఉంచేలా ఈ టెస్ట్ బెడ్లను ఏర్పాటు చేయటంపై అందరికీ అభినందనలు. భారత తొలి ఓపెన్-యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీలతో పాటు అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ప్రోత్సహిస్తోన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఏక్వూవీ ని వేగంగా పూర్తి చేయటంలో సహకరిస్తున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కార్యదర్శి అభయ్ కరాండికర్కు ధన్యవాదాలు. అమరావతిలో ప్రారంభమైన 1ఎస్ ,1 క్యూ క్వాంటం హార్డ్వేర్ టెస్ట్బెడ్స్ క్వాంటం ఉపకరణాలను పరీక్షించడానికి, సర్టిఫై చేయడానికి కీలకం. దేశంలోని తొలి క్వాంటం కంప్యూటర్లకు ఆంధ్రప్రదేశ్ వేదిక అయినందుకు గర్విస్తున్నాను. ఐటీ రంగంలో కీలక పాత్ర పోషించిన తెలుగు గడ్డ ఇప్పుడు క్వాంటం టెక్నాలజీకి వేదికగా మారటం సంతోషదాయకం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
డిసెంబరు లో క్వాంటం వ్యాలీ….
కృష్ణా నదీ తీరంలో ప్రజా రాజధాని అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా కాలుష్యరహితంగా నెట్ జీరో కాన్సెప్టుతో నిర్మిస్తున్నాం. అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించింది. తిరుపతిలో స్పేస్ సిటీ, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్, విశాఖలో మెడ్ టెక్, అనంతపురంలో సెమీ కండక్టర్ ఉత్పత్తి కేంద్రాలు అభివృద్ధి చేస్తున్నాం. డేటా సెంటర్ సహా, ఏఐ మౌలిక సదుపాయాలను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం. 15 బిలియన్ యూఎస్ డాలర్లతో గూగుల్ అతిపెద్ద పెట్టుబడిని ఏపీలో పెడుతోంది. ప్రతీ పౌరుడికీ ఏఐ లాంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం. డిసెంబరు నుంచి అమరావతిలో క్వాంటం వ్యాలీ కూడా ప్రారంభం అవుతుందని చంద్రబాబు చెప్పారు.








Leave a Reply